మయూరి సుధ
>> ఆదివారం 22 నవంబర్ 2009
చంద్రబింబం లాంటి మోము ఆమెది... సుధారసాన్ని కురిపించే మాటలు ఆమెవి... కాలికి గజ్జ కట్టి ఆమె శాస్త్రీయ నృత్యం చేయటం మొదలుపెడితే మయూరాన్ని తలపించి ,ఆపై మరిపించగల నాట్య విన్యాసం ఆమెది. ఆమె కెంపులు, అరవంకలు- వడ్డాణపు నడుమొంపులు మనలను ముగ్ధులను చేస్తాయి.. కాటుక కన్నులు, పూలజడల అరమరికతలు మనసును పరవశింపజేసి నాట్యం చేయిస్తాయి... ఆమె నడకలో వయ్యారాలు, చూపుల్లో సితారలు చిలిపిగా పలకరిస్తాయి... కుడి ఎడమల క్రీగంటి చూపులు, జతులు, గతులు, ముద్రలు ముగ్ధమనోహరంగా పలకరిస్తాయి... జీవితంలో ఎదుర్కొన్న ఓ ప్రమాదం తనను మానసికంగా కృంగదీసి ప్రాణసమానమైన నాట్యానికి దూరం చేసినా మొక్కవోని పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో విజయం సాధించిన ఓ అసాధారణ మహిళ "సుధా చంద్రన్".
మొన్న శనివారం ఆ వారాంతం ఎలా గడుపుదామా అని ఆలోచిస్తున్న సమయంలో సోదరుడు శ్రీనివాస్ కుమార్ ఫోన్ చేసి ’మయూరి సుధ’ గారి నాట్య ప్రదర్శన రవీంద్ర భారతిలో ఉంది- వస్తావా? అని అడిగారు-ఎప్పుడో 10వ తరగతిలో ఆమె గురించి పాఠంగా చదువుకున్న నాకు ఆమె ప్రదర్శనను తిలకించే అదృష్టం, నాకు పునర్జన్మను ప్రసాదించిన ఆమెను కళ్ళారా చూసే అవకాశం వస్తే ఎగిరి గంతేసి "సరే" అని చెప్పా... కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి శ్రీనివాస్ కుమార్ గారి కుటుంబం, అశ్విన్ బూదరాజు, నేను రవీద్ర భారతికి చేరుకున్నాం.
సుమారు పాతిక సంవత్సరాల తర్వాత హైదరాబాదులో ఆమె నాట్య ప్రదర్శన. నటరాజ స్వామికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళిపోయారు.
మొదటి అంకం- ’సీతా స్వయంవరం’- సీతగా సిగ్గును కురిపించింది.. రావణునిగా దర్పాన్ని ప్రదర్శించింది.. రామచంద్రుని సౌకుమార్యాన్ని, వినయాన్ని అభినయించింది... శివధనుర్భంగం నుండీ రావణ సంహారం దాకా అంతా తానే... ప్రేక్షకుల హర్షధ్వానాలు.....
రెండో అంకం- ’ ఆది శంకర విరచిత భజగోవిందం’- భజగోవిందం నృత్యరూపకంగా చూడటం నాకు ఇదే ప్రధమం. ఆ శ్లోకాలలోని పరమార్ధాన్ని ఆమె ప్రదర్శించిన తీరు వర్ణనాతీతం... సంస్కృత భాష తెలియని వారికి కూడా ఆమె హావభావాలతో భజగోవింద శ్లోకాల అంతరార్ధం అవగతమైందంటే అతిశయం కాదేమో!!!
మూడో అంకం- "దశావతారాలు"- 'మత్స్య,కూర్మ, వరాహశ్చ, నారశింహశ్చ, వామనః- రామో, రామశ్చ, కృష్ణశ్చ, బుద్ధ, కల్కి రేవచః' అని చిన్నప్పుడు చదివిన శ్లోకం, ఆ అవతారాలు కళ్ళముందు మెదిలాయ్. ఒక్కొక్క అవతారం నుండీ మరో అవతారానికి గల పరిణామక్రమాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన తీరు అనిర్వచనీయం. ముఖ్యంగా వామనావతారం, నృశింహావతారం, రామావతారం,కృష్ణావతారం(కురుక్షేత్ర ఘట్టం).. అంకం పరిసమాప్తమయ్యేసరికి ఆనందంతో చెమరిన కళ్ళు, మ్రోగిన చప్పట్లు అనేకం.
కూచిపూడి నృత్యం ద్వారా తెలుగు ఖ్యాతిని ప్రపంచ దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ శోభానాయుడు గారి చేతుల మీదుగా "నాట్య కళా నిధి" పురస్కారాన్ని సుధా చంద్రన్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న మరో విశేషం పుంభావ సరస్వతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత నారాయణ రెడ్డి గారిని మేము కలవగలగటం. అక్కినేని మొదలు నావరకు ఎందరో ఆవిడ నాట్యం చేస్తున్నప్పుడు కృత్రిమ కాలిని చూడటానికి ప్రయత్నించి విఫలులమయ్యాం... కారణం సమ్మోహనం.
కార్యక్రమానంతరం మయూరి సుధ గారిని కలిసి ఓ నాలుగు నిమిషాలు మాట్లాడగలిగే అవకాశం కలిగింది. ఆమె కాళ్ళకు నమస్కరించి క్లుప్తంగా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. "మూడున్నర నెలల క్రితం ఓ ప్రమాదంలో నా కాలు విరిగింది... దాదాపు రెండు నెలల పాటు నేను మంచంపైనే విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి... అప్పుడే మొదలుపెట్టిన వ్యాపారం నేను లేని కారణంగా అనేక సమస్యలను సృష్టించటం, మనసు ఆందోళన చెందటం వల్ల నిస్పృహ నన్ను ఆవహించింది. ఆ సమయంలో ఓ రోజు టీవీలో మీ ’మయూరి’ సినిమా చూశాను. అది నాలో ఉత్తేజాన్ని నింపి స్థైర్యాన్ని పెంచింది. ఇప్పుడు నేను అన్ని అవరోధాలనూ అధిగమించాను- అందుకు పరోక్షంగా మీరు కారణం.. మీకు నా కృతజ్ఞతలు"--- దానికి ఆవిడ ఇచ్చిన సమాధానం " పరిస్థితులకు తలవంచితే మనం ఓడిపోయినట్టే- గెలుపు ఇచ్చే ఆనందం కోసం అప్పట్లో నేను నొప్పిని భరించి సాధన చేశాను. పట్టుదలతో కృషి చేసేవారికి విజయం తధ్యం. ఇన్ని వందల మంది మీరు నాట్యం బాగా చేస్తారు అని చెప్పే మాటలకన్నా మీ మాటలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. విజయోస్తు"...
ఆమెకు వీడ్కోలు చెప్పి మధురానుభూతులను వెంటతెచ్చుకున్నాను- రేపటికి నా అనుభూతి జ్ఞాపకంగా మారినా పరిమళాలను వెదజల్లుతూ మనసులో సజీవంగా మిగిలిపోతుంది. యువతరానికి స్ఫూర్తినిచ్చే ఈ అసాధారణ నాట్య మయూరి మరెందరో జీవితాలను ప్రభావితం చేయాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ...
ఎందరో మహానుభావులు... అందరికీ వందనములు...
Read more...

